ఆరోగ్య శ్రీకాకుళం సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ దృష్టిసారించాలని రాష్ట్ర రహదారులు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పక్షోత్సవాల కార్యక్రమంలో ఆది వారం మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆరోగ్య సమాజంపై అవగాహన కలిగించుటకు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని డా.బి.ఆర్.అంబేద్కర్ కూడలి వద్ద మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల సిల్వర్ జుబిలి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మంచి ఆరోగ్య సమాజ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. అనారోగ్యం భారీన పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్తలు వహించాలని అన్నారు. మన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు.