రాష్ట్రంలో వైసిపి కి ప్రధాన ప్రతిపక్షం బిజెపి నే.. అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఉద్ఘాటించారు. శనివారం ఉదయం ప్రొద్దుటూరు లోని రాయలసీమ ముఖ్య నేతలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో బిజెపి ని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అని, రాయలసీమ అభివఅద్ధి పై నాయకులతో చర్చించనున్నామని అన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. గత అయిదేళ్లలో టిడిపి ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుందని, అందుకే అది కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధమైతే.. తమ వంతు సహకారం అందించడానికి తాము సిద్ధమేనన్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా రాకపోయినా, రాష్ట్రంలో వైసిపి కి ప్రధాన ప్రతిపక్షం బిజెపి నే నని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బిజెపి ప్రభంజనం మొదలైందని.. అది ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు..నని చెప్పారు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు పరోక్ష పాత్ర ఎంతైనా ఉందని, చంద్రబాబు ఆలోచనల పైనే రాష్ట్రంలో బిజెపి ఆధారపడి ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల పై ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. జమిలి ఎన్నికల కారణంగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.