ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ మాటను నిలబెట్టుకుంటారా లేదా అని జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈనెల 17నుంచి జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఏపీలో భూముల రీసర్వే కోసం రూ.1800 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని చెప్పారు.డెన్మార్క్ దేశంలో జరిగిన భూసర్వేను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపే విషయాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల ఇళ్లను పేదలకు నిర్మించేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తోందని వివరించారు.