ఇసుక లేక 20లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇసుక ద్వారా 900 కోట్లు ఆదాయం వచ్చేదన్నారు. అయినా చంద్రబాబు మాత్రం ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రెండు వేలు ఉంటే.. ఇప్పుడేమో 10 వేలు అయిందన్నారు. మిగతా 8 వేలు ఏ పంది కొక్కులు తింటున్నాయని ఫైరయ్యారు. అవగాహన లేని దుర్మార్గపు వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజావేదిక కూల్చి అశుభంతో జగన్ పాలన ప్రారంభించారన్నారు. వరద కష్టాల్లో ప్రజలుంటే జగనేమో విదేశీ పర్యటనలు చేశారని విమర్శించారు. ఒక్క అవకాశం ఇద్దామనుకున్న ప్రజల నమ్మకాన్ని జగన్ వమ్ము చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ కంపెనీలతో కమిషన్ కుదరకపోవటంతోనే ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వం కొత్త నాటకం మొదలు పెట్టిందని ధ్వజమెత్తారు. ఇసుక టెండర్ల పేరుతో వైసీపీ నేతలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు.