ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ నిండు కుండల్లా మారాయి. అయితే కృష్ణానది వరద సమయంలో ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద పడవ చిక్కుకున్న సంగతి తెలిసిందే.ఆ చిక్కుకున్న పడవను బయటకు తీసేందుకు నిపుణుల బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ పడవ గేటు నుంచి కొంచెం కదిలింది. ఇంకొంచెం ముందుకు వస్తే అధికారులు గేటును మూసి వేయనున్నారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత అన్ని గేట్లను మూసివేసినప్పటికీ పడవ అడ్డుగా ఉండటంతో సదరు గేటు మూసివేత కుదరలేదు. ఫలితంగా పెద్ద మొత్తంలో నీరు వృథాగా కిందికి పోతోంది. గత కొన్ని రోజులుగా ఆ పడవను తొలగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజగా పడవ ముందుకు కదలడంతో గేటు మూసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.