ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం తీరుపై మండిపడ్డ టీడీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2019, 09:46 PM

పోలవరంపై ప్రయోగాలు వద్దని ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్లిందని విపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. లేని అవినీతిని నిరూపించాలని చూశారని తెలిపారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను నిలిపివేస్తూ గురువారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు స్పందించారు. ఈ తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతుందని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలో, రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదు. ఈ జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుంది. ఒకసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్టు పూర్తవడం కష్టమని కేంద్ర మంత్రి గడ్కరీ గతంలోనే చెప్పారు’’ అని చంద్రబాబు గుర్తు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గతంలో తన తండ్రిలాగే ఇప్పుడు జగన్‌ కోర్టులతో మొట్టికాయలు తిన్నారని వ్యాఖ్యానించారు. పోలవరాన్ని జగన్‌ ప్రభుత్వం కోర్టులపాలు చేసిందన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ డిమాండ్‌ చేశారు. మూడు నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న విపరీత నిర్ణయాలకు కోర్టు తీర్పు శరాఘాతం లాంటిదనీ, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి రెడ్డి అన్నారు. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా, ప్రమాదకరంగా ఉన్నాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com