అమరావతిలో రాజధాని ఉంటుందో లేదో తక్షణమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రామకృష్ణను రాజధానికి భూములిచ్చిన రైతులు కలిశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా తమకు అండగా నిలవాలని రైతులు, గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. 34 వేల ఎకరాలకు పైగా రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా గత ప్రభుత్వానికి భూములు ఇచ్చారన్నారు. కానీ వారికి ప్రస్తుత ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. రాజధానిపై మంత్రులు రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలకు అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కానీ జగన్ ఇప్పటి వరకూ ప్రకటన చేయకపోవడం సరైంది కాదని హితవు పలికారు. రాజధానిలో ఆగిన పనులను కొనసాగించాలని కోరారు. రాజధాని రైతులకు ఏవేవీ హామీలిచ్చారో.. ఆ హామీలను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనన్నారు. రాజధాని ప్రాంత వాసులకు సీపీఐ అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు.