తన ఇల్లు ముంచాలనే ఉద్దేశంతో కృష్ణా నదీపరివాహక ప్రాంతాలన్నీ ముంచారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇటీవల కృష్ణానదికి సంభవించిన వరదలు వైపరీత్యం వల్ల కాదని, ప్రభుత్వ వైఫరీత్యమే అని ఎద్దేవా చేశారు. తన ఇంటిని ముంచే కుట్రతో ప్రజలను నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని నియంత్రించడానికి అవకాశం ఉన్నప్పటికీ అలా చేయలేదని.. రాజధానిని వరద నీటితో ముంచాలన్న తప్పుడు ఆలోచనతో వైకాపా ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఇటీవల సంభవించిన వరద పరిస్థితులపై గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని 19 గ్రామాల్లో పర్యటించానని, వరద పరిస్థితిని సమీక్షించానని తెలిపారు. ఎక్కడ చూసినా హృదయ విదారక పరిస్థితులు కనిపించాయన్నారు. దాదాపు 53 వేల ఎకరాల పంటభూములు నీట ముగినిగాయని అన్నారు. వరదలపై ఏనాడూ ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదని ఆరోపించారు.