టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి మంగళవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా పాంచజన్యం, కౌస్తుభం, హెచ్విసి విశ్రాంతి గృహాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట పరుపులు, దిండ్లు మార్చాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని, స్నానపు గదుల డోర్లు మార్చాలని సూచించారు. పాంచజన్యం గదుల్లోని సౌకర్యాలపై పలువురు భక్తులతో మాట్లాడగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ తరువాత సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టితో కలిసి ప్రత్యేకాధికారి శ్రీవారి ఆలయ మాడ వీధులు, ఉగ్రాణం, అనంతాళ్వార్ తోట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, దివ్యదర్శనం కాంప్లెక్స్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. మాడ వీధుల్లో భూగర్భ కేబుల్ పనులను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి వదిలే విధానాన్ని పరిశీలించారు.