కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 4 నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు.కరకట్టపై వరద నీరు చేరడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి పయనమయ్యారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని గీతానగర్ తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులతో కలిసి పర్యటిస్తున్నారు. వరద నీట మునిగి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. అనంతరం ఆయన మీడియాతో సమావేశమయ్యే అవకాశముంది. అంతకుముందు హైదరాబాద్ నుంచి స్పైస్జెట్ విమానంలో గన్నవరం చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన విజయవాడ చేరుకున్నారు.