శ్రీవారి బ్రహ్మూెత్సవాలలో గరుడసేవకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం లగేజీ కౌంటర్లను పెంచి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాలలో వివిధ రాష్ట్రాల కళాబృందాలను ఆహ్వానించేందుకు ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే 10 రాష్ట్రాల నుండి కళాబృందాలను పంపేందుకు ఆమోదం తెల్పారని, మిగిలిన రాష్ట్రాల కళాబృందాలను పంపేందుకు అక్కడి అధికారులతో చర్చించాలని తిరుపతి జెఈవో శ్రీ పి. బసంత్ కుమార్ను కోరారు. టిటిడి ప్రచురణలను అన్నింటిని భక్తులకు అందుబాటులో ఉంచేలా ఆన్లైన్లో క్రోడికరించాలన్నారు. పాఠకుల నుండి విశేష ఆదరణ పొందిన పుస్తకాలను పున: ముద్రించాలని ఆదేశించారు.
భక్తులు కాలిమార్గాన నడిచే అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రాంతాలలో ఉన్నతాధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని, అదేవిధంగా వర్షానికి తడవకుండా, ఎండలకు ఇబ్బంది లేకుండా నిర్మించిన పైకప్పును అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని నాలుగ మాడ వీధులలో భూగర్భ పైప్లైన్ పనులను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. బ్రహ్మూెత్సవాలలోపు పెండింగ్లో ఉన్న ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. టిటిడి అటవీశాఖ, ఉద్యానవన శాఖలు సమన్వయం చేసుకుని తిరుమలలోని శ్రీపద్మావతి వసతి సముదాయాం, రోడ్ల కూడళ్లు తదితర ప్రాంతాలలో మరింత పచ్చదనం పెంచాలని ఆదేశించారు.
తిరుమలలోని మరుగుదొడ్లు, స్నానపుగదులలో అవసరమైన మరమ్మతు పనులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను, అదేవిధంగా తరచూ పర్యవేక్షణ చేపట్టి మరింత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల భవనాలపై పిడుగు నివారణ పరికరాలను అమర్చాలని సూచించారు. భక్తులు ఎక్కువమంది సందర్శించేలా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను తీర్చిదిద్దాలని ప్రత్యేకాధికారి శ్రీ ఏవీ ధర్మారెడ్డిని కోరారు. కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయ పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు.