కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు వెలిసిన శేషాచలం అడవి ప్రకృతి సోయగానికి, అరుదైన వృక్ష, జంతు, పక్షిజాతులకు నిలయం. అడవి జంతువుల గురించి యాత్రికులకు అవగాహన కల్పించడంతోపాటు వాటిని సంరక్షించేందుకు టిటిడి కెమెరాల ద్వారా గుర్తింపు చర్యలు చేపట్టింది. తద్వారా అత్యంత అరుదైన పునుగుపిల్లి, కొండ గొర్రె, మూషిక గొర్రె, అడవి కుక్క(రేచు కుక్క)తోపాటు చిరుత, ముంగిస, అడవి కోడి, ముళ్లపంది, కణితి, ఎలుగుబంటి తదితర జంతువులు ఉన్నట్టు వెలుగుచూసింది.
ఏడు కొండల్లో సుమారు 82,500 హెక్టార్ల విస్తీర్ణంలో శేషాచలం అడవి విస్తరించి ఉంది. ఇందులో టిటిడి పరిధిలో 2700 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతాల్లో అరుదైన జీవజాతులను సంరక్షించడంతోపాటు పలురకాల మొక్కలను టిటిడి పెంచుతోంది. ఇందులో భాగంగా అటవీ విభాగం ఆధ్వర్యంలో జంతువులను గుర్తించేందుకు పార్వేటిమండపం, శ్రీగంధం వనం, కుమారధార-పసుపుధార డ్యామ్ రోడ్డు, ధర్మగిరి, పాపవినాశనం, శేషాచలం అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు ఏర్పాటుచేశారు. ఏవైనా జంతువులు కెమెరాకు నిర్దిష్టమైన దూరంలో వెళితే సెన్సార్ ద్వారా వెంటనే ఫొటో తీయడం దీని ప్రత్యేకత. ఈ విధంగా టిటిడి అటవీ ప్రాంతంలో రాత్రి, పగటి వేళల్లో తీసిన పలు ఫొటోల ద్వారా జంతువుల జాడను గుర్తించారు.
ఈ జంతువుల సంచారం ఉన్న ప్రాంతాల్లో టిటిడి బోర్డులు ఏర్పాటుచేసి యాత్రికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ఎలుగుబంటి, చిరుత దాడి ఘటనల నేపథ్యంలో టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అడవి జంతువులను కాపాడేందుకు ఆయా ప్రాంతాల్లో నీటిని అందుబాటులో ఉంచడం, గడ్డి పెంచడం తదితర చర్యలు చేపడుతున్నట్టు టిటిడి డిఎఫ్వో ఫణికుమార్ నాయుడు తెలిపారు.