బీజేపీ, హిందూ ధార్మిక సంస్థలు ఇచ్చిన చలో శ్రీశైలం పిలుపుతో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. శ్రీశైలం దేవస్థానంలో దుకాణాల వేలంలో అన్యమతస్థులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు వేలంపాటం విషయంలో దుకాణాదారుల మధ్యవిబేధాలు తలెత్తడంతో వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వ్యవహారం కాస్త బీజేపీ, హిందూ ధార్మిక సంస్థల వద్దకు వెళ్లింది. దాంతో శ్రీశైలం దేవస్థానంలో దుకాణాలలో అన్యమతస్థులకు ప్రాధాన్యత ఇవ్వడం, దేవస్థానంలోనే అన్యమతస్థులు నివసించడాన్ని నిరసిస్తూ ఈనెల 20న చలో శ్రీశై లం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. తాళ్లపాయిలెం పీఠాధిపతి శివస్వామిని సైతం అదుపులోకి తీసుకున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో దేవాదాయ ధర్మదాయ శాఖ అప్రమత్తమైంది. చలో శ్రీశైలంను అడ్డుకునేందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. వివాదాలకు కారణంగా భావిస్తూ ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తిపై బదిలీ వేటు వేసింది. అలాగే దేవస్థానం పరిధిలోని దుకాణాల వేలంపాటను రద్దు చేస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు నూతన ఈవోగా కేఎస్ రామారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే కేఏస్ రామారావు బాధ్యతలు చేపట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.