తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిరోజు అంకురార్పణ ఉత్సవం ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం గద్వాల పంచెలు సిద్ధం చేశారు. గద్వాల ఏరువాడ జోడు పంచెలను స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. 136 ఏళ్ల నుంచి తిరుమల శ్రీవారితో అనుబంధం ఉందని, గద్వాల చేనేత పరిశ్రమ ఖండాంతర ఖ్యాతిని అర్జించిందని స్థానిక చేనేత కార్మికుల నమ్మకం. శ్రీవారి సేవలకు దేశం నలుమూలల నుంచి ఎన్నో విలువైన కానుకలు అందుతాయి. అయినప్పటికి జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల సంస్థానం కానుకగా అందించే ఏరువాడ జోడు పంచెలకు ప్రత్యేకత ఉంది. సంస్థాన రాజు శ్రీ కృష్ణరాంభూపాల్తో మొదలైన సంప్రదాయాన్ని సంస్థానాదీశుల వారసులైన లతభూపాల్ నేటి వరకు కొనసాగిస్తున్నారు.
సంస్థానాలు కాలగర్భంలో కలిసిపోయినా పూర్వికులు కొనసాగించిన సంప్రదాయాన్ని వారసులు ఆచరిస్తుండడం పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి అలంకరణ కోసం గద్వాల చేనేత కార్మికులు నెల రోజులుగా నామాల మగ్గంపై పంచెను నేయడం ప్రారంభించి పూర్తి చేశారు. ఐదుగురు చేనేత కార్మికులు నియమ నిష్టలతో జోడు పంచెల నేత పనిని పూర్తి చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సెప్టెంబర్ 5న టీటీడీ ప్రధాన అధికారికి జోడుపంచెలను అందించనున్నట్టు మహంకాళి కరుణాకర్ తెలిపారు.
సహజంగా నేత మగ్గాన్ని ఇద్దరు కలిసి ఒకేమారు నేస్తారు. నామాల మగ్గానికి మాత్రం ముగ్గురు కార్మికులు ఒకేసారి నేస్తారు. ఏ ఒక్కరు తప్పు చేసినా నేత ముందుకు సాగదు. జీవితంలో తెలిసీతెలియక తప్పులు దొర్లితే... మగ్గం దగ్గరకు వచ్చే సమయానికి ఆ విషయం తమకు పరోక్షంగా తెలుస్తుందని, అందువల్ల అత్యంత జాగ్రత్తగా భక్తి, శ్రద్ధలతో ఉంటామని నేత కార్మికులు గద్దె మురళి, కేశవ్, సాక సత్యం, షణ్ముకరావు, మహాంకాళి కరుణాకర్, మేడమ్ రమేష్ తెలిపారు. జోడు పంచెల తయారీ మొదలు వాటిని తిరుమలలో అధికారులకు అందజేసే వరకు మగ్గం ఉన్నచోట ఇంట్లో నిత్యం పూజలు చేయడం... గోవిందనామస్మరణ చేసుకుంటూ నేత పనికి పూనుకుంటామన్నారు.
11 గజాల పొడవు, ఇరువైపుల 11 ఇంచుల బోర్డర్తో కంచుకోట కొమ్మ నగిషీలతో ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి నేయడం జోడు పంచెల తయారీలో దాగి ఉన్న సాంకేతిక పరమైన అంశం. 80 అడుగుల వెడల్పు, 13 అంగుళాల అంచు ఉంటుంది. ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు నెల రోజులు పడుతుంది. దేశం నలుమూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. వాటికి అలంకార ప్రాయంగా ప్రత్యేక వేడుకల్లో మాత్రమే శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. గద్వాల చేనేత కార్మికులు తయారు చేసిన ఏరువాడ జోడు పంచెలు మాత్రం శ్రీవారి మూలవిగ్రహానికి అలంకరిస్తారు. ఇదే ఈ జోడుపంచెలకు ఉన్న స్పెషాలిటీ.