పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలపై ఆరా తీసింది. ఈ మేరకు సమగ్ర నివేదిక సమర్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రానికి ఎలాంటి సమాచారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం టెండర్లు రద్దు చేయడం.. రివర్స్ టెండరింగ్కు నోటిఫికేషన్ జారీ చేయడం తదితర అంశాల నేపథ్యంలో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ పీపీఏను కేంద్రం కోరడం చర్చనీయాంశమైంది.
రివర్స్ టెండరింగ్కు వెళ్లడం సరైన పద్ధతి కాదంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. లేఖ రాసిన తర్వాతి రోజే రివర్స్ టెండరింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఆ సమాచారాన్ని కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ చేరవేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఎంతమేరకు జరిగింది? బిల్లులు ఎంతమొత్తంలో చెల్లించాల్సి ఉంది?తదితర అంశాలపై కేంద్రం ఆరా తీసినట్లు సమాచారం. పోలవరంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరడంతో పూర్తి వివరాలు అందించేందుకు ప్రాజెక్టు అథారిటీ సిద్ధమవుతోంది. పోలవరం తాజా పరిస్థితి, రివర్స్ టెండరింగ్తో ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలపై పీపీఏ కేంద్రానికి నివేదిక సమర్పించే అవకాశముంది. పీపీఏ నివేదిక తర్వాతే పోలవరంపై కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి.