ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ పథకాన్ని వైఎస్సార్ పెళ్లికానుకగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల పెళ్లి భారం కాకుండా ఉండేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చందన్న పెళ్లి కానుక పేరుతో పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదలు లబ్దిపొందారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లును మారుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పథకం పేరును వైఎస్సార్ పింఛను కానుకగా, మధ్యాహ్న భోజన పథకం పేరును వైఎస్సార్ అక్షయపాత్రగా మార్చారు.