ఇంటిపై వైసీపీ నేతలు దాడికి యత్నించారని మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ స్పీకర్ అయిన తనకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తన కుటుంబంపై రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే తన కుటుంబ సభ్యులపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పోలీసులు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించకపోతే శాంతియుతంగా ఆందోళన చేపడతానని ప్రకటించారు. పార్టీ ఆదేశాల మేరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
కాగా, నరసారావుపేటలో కోడెల శివప్రసాద్ నివాసం వద్ద కేబుల్ వైర్లతో ఉన్న ట్రాక్టర్ను వైసీపీ నేతలు వదిలి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య కేబుల్ వార్ జరిగింది. ఆ సందర్భంగా కట్ చేసుకున్న వైర్లను వైసీపీ నేతలు కోటలో వదిలి వెళ్లారు. అయితే కోడెల వర్గీయులు అడ్డుకొని బయట పెట్టారు. ఇప్పుడు మరోసారి వైర్ల ట్రాక్టర్ను కోటలో వదిలి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కోట నుంచి కేబుల్ వైర్ల ట్రాక్టర్ను స్టేషన్కు తరలించారు.