ఆమెకు పెళ్లయింది.. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం స్థానికంగా ఉండే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆమె పిల్లలు హాస్టల్లో చదువుకుంటుండటం.. భర్త పనికోసం బయటకు వెళ్లడం.. ఆ యువకుడు గమనించాడు. ఇంట్లో భర్త లేనప్పుడు కలుసుకోవడం మొదలుపెట్టారు. అలా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అది ఎక్కడిదాకా వెళ్లిందంటే.. ప్రియుడు మోజులో ఆమె ఏకంగా భర్తనే చంపేసింది. చిత్తూరు జిల్లా ధర్మరాజులపురంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ధర్మరాజులపురంలో రాందాస్(36),మొగిలీశ్వరి(31) దంపతులు చాన్నాళ్లుగా నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. వారు చిత్తూరు పట్టణంలోని హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఇదే క్రమంలో ఉమాపతి(26) అనే స్థానిక యువకుడితో మొగిలీశ్వరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఉమాపతికి మొగిలీశ్వరి పలుమార్లు డబ్బు కూడా ఇచ్చింది. శనివారం రాత్రి ఉమాపతిని ఆమె ఇంటికి పిలిపించింది. భర్త పశువుల కొట్టంలో పడుకోగా.. అతనికి తెలియకుండా వాళ్లిద్దరూ ఇంట్లో ఉన్నారు.రాత్రంతా ఏమం మాట్లాడుకున్నారో తెలియదు గానీ.. తెల్లవారుజామున దారుణానికి ఒడిగట్టారు.
పశువుల కొట్టంలో పడుకున్న రాందాస్పై ప్రియుడితో మొగిలీశ్వరి దాడి చేయించింది. రాందాస్ కాళ్లు గట్టిగా పట్టుకున్న మొగిలీశ్వరి.. ప్రియుడితో అతన్ని పొడిపించింది. ఆ తర్వాత ప్రియుడిని అక్కడినుంచి పంపించి.. తన భర్తను ఎవరో చంపేశారని డ్రామా మొదలుపెట్టింది. కానీ పోలీసులకు ఎక్కడో తేడా కొట్టి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది. ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్టు అంగీకరించింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు