వెస్టిండీస్లో పర్యటిస్తున్న భారత జట్టుకి ఉగ్రముప్పు పొంచి ఉందని బీసీసీఐకి ఓ ఈ మెయిల్ రావడంతో బీసీసీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అది తప్పుడు మెయిల్ అని నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. వెస్టిండీస్ ప్రభుత్వంతో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది. దీనిపై ఆంటిగ్వాలోని భారత హైకమిషన్కు సమాచారమిచ్చామని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి చెప్పారు. ఈ నేపథ్యంలో హైకమిషన్.. స్థానిక ప్రభుత్వ యంత్రంగాన్ని అప్రమత్తం చేసిందని, భారత ఆటగాళ్లకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారి చెప్పుకొచ్చారు. అక్కడి పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉందని, అవసరమైతే మరింత భద్రత పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.