గతంలో దేవాలయం కట్టడానికి అంగీకరించిన వర్గం ఇప్పుడు ఈ ప్రదేశంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేసుకుందాం అంటూ చెప్పడంతో దళిత కాలనీ లో ఆలయ నిర్మాణం ఆగిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి దళిత కాలనీలో ఇరువర్గాల అంగీకారంతో దేవాలయం నిర్మాణం చేపట్టారు. గ్రామం లోనే కాక సుదూర ప్రాంతాలలో చందాలు సేకరించి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఐతే ఓ వర్గం ఆలయం బదులు బస్టాప్ ఏర్పాటు చేసుకుందామని చెప్పడంతో రెండు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త పెద్దదయింది. దీంతో ఇరు వర్గాలు తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన తహసిల్దార్ , పోలీసులను, ఇతర అధికారులను కలిసి గ్రామానికి తీసుకు వెళ్లి ఇరువర్గాలతో చర్చించారు. ఇరువర్గాలు వారు తహసిల్దార్ ముందే వాగ్వాదానికి దిగడంతో చేసేది లేక మీకు రెండు రోజులు సమయం ఇస్తున్నామని ఈ లోపు పరస్పర అంగీకారానికి వస్తే ఇరువురికి న్యాయం చేస్తామని చెప్పారు. బస్సు స్టాప్ కోసం కూడా స్థలం చూద్దామని చెప్పడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చినట్టైంది.