కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ శనివారం ఉదయం శేషవస్త్రం సమర్పించారు. హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో 1595వ సంవత్సరంలో తమిళనాడులోని కావేరిపట్నంలో శ్రీ తిమ్మన్న భట్ట, శ్రీమతి గోపికాంబ దంపతులకు శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.
ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠానికి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చేరుకోగానే మఠం ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పార్పత్తేదార్ గురురాజారావు పాల్గొన్నారు.