తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి వినియోగించే కూరగాయలు సరఫరా చేసే దాతలతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ తిరుమలలో పెద్ద ఎత్తున భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు కూరగాయల దాతలు ఎంతో సహకారం అందిస్తున్నారని తెలిపారు. 2005వ సంవత్సరంలో కూరగాయల దాతల అసోసియేషన్ ఏర్పాటు జరిగిందని, అప్పటినుండి నిరంతరాయంగా కూరగాయల సరఫరా జరుగుతోందని వివరించారు. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా విలువైన కూరగాయలను దాతలు విరాళాలుగా అందించారని వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 6 నుండి 8 టన్నుల కూరగాయలు అవసరమవుతోందని, పూర్తిగా దాతలే అందిస్తున్నారని తెలియజేశారు. తాజా కూరగాయలు సరఫరా చేస్తుండడంతో అన్నప్రసాదాలు రుచికరంగా, నాణ్యంగా ఉంటున్నాయన్నారు. అన్నిరకాల కూరగాయలు సరఫరా చేయాలని కోరడంతో దాతలు అంగీకరించారని తెలిపారు. కూరగాయల సేకరణకు అవసరమైన వాహనాలను రెండు నెలల్లోపు సమకూర్చుతామన్నారు. పలువురు దాతలు కూరగాయలు కొనుగోలు చేయడంతోపాటు సొంతంగా వాహన అద్దె చెల్లించి పంపుతున్నారని, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం దాతలు విజయవాడ నుండి కుటుంబరావు, చెన్నై నుండి ఎస్.చంద్రన్, త్యాగరాజన్ మాట్లాడుతూ తమ అనుభవాలను తెలియజేశారు. తిరుపూర్ నుండి రాజేంద్రన్ మాట్లాడుతూ తన వద్ద వాసు అనే డ్రైవరు పనిచేస్తున్నారని, ఆయనకు చాలా కాలంగా సంతానం లేదని చెప్పారు. ఆ డ్రైవరు ఎంతో భక్తిశ్రద్ధలతో తిరుమలకు కూరగాయల లోడు తీసుకొస్తారని, ఇటీవల స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు.