కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం డ్యామ్ కు వరద నీరు పోటెత్తింది. దీంతో గేట్లను ఎత్తివేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆగస్టు 09వ తేదీ గేట్లను తెరిచారు. మొత్తం 10 గేట్లను తెరవడంతో శ్రీశైలం జలాలు నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. గేట్లను ఎత్తివేశారన్న సమాచారం తెలుసుకున్న ప్రజలు డ్యామ్ ను చూడటానికి తరలివస్తున్నారు. వీకెండ్స్ కావడంతో శ్రీశైలం పరిసర ప్రాంతాలు సందడి సందడిగా మారాయి. శ్రీశైలం డ్యామ్ నుంచి విడుదలవుతున్న నీటిని చూస్తూ కేరింతలు కొడుతున్నారు. సందర్శకులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు.
అల్మట్టి, నారాయణపూర్, జురాల జలాశయాలను దాటి కృష్ణమ్మ పరుగులు పెట్టింది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో రోజు రోజుకు పెరిగింది. దీంతో శ్రీశైలం డ్యామ్ నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 883 అడుగుల మేర నీరు ఉంది. ఇన్ ఫ్లో 4లక్షల ఐదు వేల క్యూసెక్కులు ఉండగా.. 2 లక్షల 35వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద కొనసాగడంతో పాటు కర్నాటక, మహారాష్ట్రలో ఇంకా వర్షాలు కురుస్తుండడంతో...శ్రీశైలం డ్యామ్కు వరద ఇలాగే కొనసాగనుంది. కొన్ని రోజుల పాటు డ్యామ్ గేట్లు తెరచుకొనే ఉండే అవకాశముంది.