ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శోభాయమానంగా వరలక్ష్మీవ్రతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2019, 05:46 PM

సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మీవ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీవ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు.


అనంతరం శ్రీపద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి, మెగళిరేకులు వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు. ఆస్థానమండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.


ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఓం శ్రీ కమలాయైనమః, ఓం శ్రీ రమయైనమ, ఓం శ్రీ లోకమాత్రేనమ, ఓం శ్రీ విశ్వజనన్యైనమః, ఓం శ్రీ మహాలక్షియైనమః, ఓం శ్రీ క్షీరాబ్దితనయైనమః, ఓం శ్రీవిశ్వసాక్షిన్యైనమ, ఓం శ్రీ చంద్ర సహోదరిన్యై నమః, ఓం శ్రీ వరలక్ష్మియై నమః అని ఆరాధించారు.


అనంతరం వేంకటాచల మహత్యం స్కాంద పురాణంలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని ఆలయ ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు భక్తులకు తెలియజేశారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు.


తరువాత ఐదు రకాల కుడుములు, ఇడ్లి, కారంతో చేసిన ఇడ్లి, తియటి ఇడ్లి, లడ్డు, వడ, అప్పం, పోలి వంటి 12 రకాల నైవేధ్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.


ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరులో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు.


వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయం వ‌ద్ద ఉన్న ఆస్థాన మండపంలో భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల పుష్పాలతో, విద్యుద్దీపాలతో అలంకరించినట్లు తెలిపారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆస్థాన మండ‌పంలో 4, ఊంజ‌ల్ మండ‌పంలో 1, తోళ‌ప్ప‌గార్డెన్‌లో 1 క‌లిపి మొత్తం 6 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశామ‌న్నారు. టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా తిరుచానూరుకు విచ్చేసే వేలది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నామన్నారు. ఈ సంద‌ర్భంగా దాదాపు 50 వేల భక్తులకు కంకణాలు, పసుపు ధారాలు, పసుపు, కుంకుమ, 2 ల‌క్ష‌ల గాజులు పంపీణి చేస్తున్నట్లు వివ‌రించారు. ఈ పర్వదినాన అమ్మవారికి బంగారుచీరతో విశేష అలంకరణ చేసినట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com