భారత్-పాక్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ ఎట్టకేలకు దిల్లీ చేరుకుంది. షెడ్యూల్ సమయాని కంటే 4.30 గంటలు ఆలస్యంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు ఈ రైలు దేశ రాజధానికి వచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలను నిలిపివేస్తున్నట్లు పాక్ అధికారులు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత భూభాగంలోకి వచ్చేందుకు పాక్ సిబ్బంది నిరాకరించడంతో గురువారం ఈ రైలు వాఘా సరిహద్దులో నిలిచిపోయింది. దీంతో కొన్ని గంటల పాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం భారత రైల్వే అధికారులు ఒక ఇంజిన్, సిబ్బందిని పంపి రైలును అటారికి తీసుకొచ్చారు. అలా భద్రతాసిబ్బంది సంరక్షణలో నిన్న రాత్రి అటారీ చేరుకున్న సంఝౌతా రైలు తనిఖీల అనంతరం ఈ తెల్లవారుజామున దిల్లీ బయల్దేరింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు దిల్లీ స్టేషన్ చేరుకుంది.
సిమ్లా ఒప్పందం ప్రకారం.. దిల్లీ-లాహోర్ మధ్య వారానికి రెండు రోజులు సంఝౌతా ఎక్స్ప్రెస్ నడుస్తోంది. అయితే తాజాగా కశ్మీర్ అంశం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు పాక్ నిన్న ప్రకటించింది. కానీ భారత రైల్వే అధికారులు మాత్రం రైలు నడుస్తోందని చెప్పడం గమనార్హం. గతంలో పుల్వామా ఉగ్రదాడి సమయంలోనూ కొన్ని రోజుల పాటు ఈ రైలు సేవలను రెండు దేశాలు నిలిపివేశాయి.