కేరళపై వరుణ ప్రతాపం కొనసాగుతోంది. తాజాగా పెరియార్ నదిపై ఉన్న ఆనకట్టలో వరద ఉద్ధృతి పెరగడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరద ప్రవేశించింది. రన్వేపై నీరు ప్రవహిస్తుండంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు విమానాశ్రయంలో సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. కొచ్చితో పాటు వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కొజిక్కోడ్ జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ విపత్తు నిర్వహణ విభాగ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని కోరారు. కొచ్చికి రావాల్సిన, కొచ్చి నుంచి బయలుదేరే విమానాల్లో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకునేందుకు, ప్రయాణ తేదీల్లో మార్పులు చేసుకునే విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు.
వర్ష సంబంధిత ఘటనల్లో గురువారం వరకు 20 మంది మృతి చెందారు. 13,000 మంది నిరాశ్రయులు కావడంతో గురువారం 60 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టులోనూ ఇదే తరహా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి పరిస్థితిని గుర్తు చేస్తోందని కేరళవాసులు భయపడుతున్నారు.