కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. శుక్రవారం భాజపా ఉపాధ్యక్షుడు శివరాజ్సింగ్ చౌహాన్ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్ ఇస్తూ.. ‘‘మోదీ ప్రభుత్వానికి వ్యవస్థలను ఏర్పరచడం చేతకాదు. దశాబ్దాలుగా ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను కూల్చడమే తెలుసు’’ అని ట్వీట్ చేశారు. కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేశారు. దీనితో పాటు మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలను షేర్ చేశారు. వీటిలో భారత ఆర్థిక వ్యవస్థ, రైల్వే గురించి ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఏఎం నాయక్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పరిధిలోని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు సిబ్బందికి జీతాలు చెల్లించలేని దీనత్వం గురించి ఆయన మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో రాహుల్ను భాజపా ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో కూరుకుపోయిన కాంగ్రెస్కు పటిష్ఠ నాయకత్వం కావాల్సిన సమయంలో రాహుల్ ‘యుద్ధ భూమి నుంచి పారిపోతున్న వ్యక్తి’లా ఉన్నారని విమర్శలు చేశారు. అంతేకాక ప్రధానిని విమర్శించిన వ్యక్తి ఎన్నికల తర్వాత ఎక్కడ ఉన్నారో పరిశీలించుకోవాలని అన్నారు.