భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ సవ్యంగా సాగుతున్నదని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. అంతరిక్ష నౌక కక్ష్యను పెంచే క్రమంలో శుక్రవారం చంద్రయాన్-2 ఇంజిన్లను 10 నిమిషాల పాటు మండించారు. ప్రస్తుతం ఉపగ్రహం నాలుగో భూ స్థిర కక్ష్యలో తిరుగుతోందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. మరోసారి ఆగస్టు 6న కక్ష్య పెంపు ప్రక్రియను చేపడతామని ఇస్రో తెలిపింది. ఆగస్టు 20 కల్లా చంద్రయాన్-2 చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరనుంది. అనంతరం చంద్రయాన్-2 నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయి చంద్రుడి ఉపరితలంపై దిగనుంది.