ప్రకాశం జిల్లా, సింగరాయకొండలో ఓ యువతిని వేధించినందుకు ముగ్గురు యువకులను చితకబాధిన ఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని వేధించారంటూ యువతి బంధువులైన ఆరుగురు యువకులు కలిసి ముగ్గురు యువకులను శివారులో ఉన్న జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద ఓ యువతిని ముగ్గురు యువకులు వేధించారు. దీంతో ఆ యువతి కుటుంబసభ్యులకు చెప్పింది. బంధువులు, కుటుంబసభ్యులు కలిసి ఆ ముగ్గురు యువకులను జామాయిల్ తోటలోకి తీసుకువెళ్లి చితకబాదారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాము ఏ తప్పు చేయలేదని చెబుతున్నా కనికరం చూపకుండా చితకబాదారని ఆ ముగ్గురు యువకులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడి చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.