గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలు నమ్మొద్దని పంచాయతీ రాజ్శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో భర్తీ చేయనున్న గ్రామ సచివాలయ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ఇప్పటికే ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. మొత్తం 20 లక్షల మంది వరకు దరఖాస్తు చేయవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ నెల 31 ఉదయం, సెప్టెంబర్ 1న రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఒకటికంటే ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఒకే పరీక్షా కేంద్రంలో అవకాశం ఇస్తామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.