కర్ణాటకలో 14 నెలల జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవటంతో 'ఇది ప్రజా విజయం' అని మాజీ సిఎం , బిజెపి నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో విశ్వాసపరీక్షలో కుమారస్వామి సర్కార్ ఓటమి తదుపరి ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో నూతన శకం ప్రారంభం కానుందని , త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా కర్ణాటకను అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. తాము కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని, విశ్వాస పరీక్షలోనే తమ బలంనిరూపితమైనందున ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా బీజేపీ నేతలు గవర్నర్ వాజూభాయ్ వాలాను బుధవారం కలవ నున్నారు.
కాగా మరోవైపు కర్నాటక అసెంబ్లీ లో విశ్వాస పరిక్ష ఓటమి, అనంతర పరిణామాలను వివరించేందుకు బీజేపీ ప్రతినిధి బృందం ఢిల్లీకి బయలుదేరింది. కొత్త ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని బిజెపి వర్గాలు చెపుతున్నాయి.