తిరుమలలో కొద్దివారాల క్రితం మణిమంజరి అతిథి గృహంలో జరిగిన చోరీ ఘటన మరువకముందే మరో దొంగతనం జరగడం భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.మరోసారి దొంగలు రెచ్చిపోయి భారీగా భక్తులను దోచేసిన ఘటన మంగళవారం జరిగింది. వివరాలలోకి వెళితే స్వామివారి దర్శనం కోసం విజయవాడకు చెందిన భక్తులు తిరుమల చేరుకుని సన్నిధానం అతిథి గృహంలో దిగారు. దర్శనం అనంతరం భోజనం చేయడానికి సమీప హోటల్కి వెళ్లారు. తదుపరి తిరిగి వచ్చిన వారికి గది తలుపులు పగులగొట్టి దర్శనమిచ్చాయి. గదిలోచోరీ జరిగినట్టు గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. వెను వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్లను రంగంలోకి దించి దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా రూ. 4 లక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు రూ. 20 వేల రూపాయలు నగదు దోచుకున్నారని బాధితులు చెపుతున్నారు. మరోవైపు అతిథి గృహం సిసి ఫుటేజ్లు పరిశీలిస్తున్న పోలీసులు ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా దైవదర్శనం కోసం తిరుమల వెళ్లేప్పుడు ఎలాంటి నగలు తీసుకురావద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.