తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన విధానాలను ప్రపంచ బ్యాంకు విశ్వసించలేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. బడ్జెట్పై చర్చలో భాగంగా ప్రపంచ బ్యాంకు నిధులపై ఇవాళ మంత్రి వివరణ ఇచ్చారు. ప్యాకేజీల్లో మార్పులపై ప్రపంచబ్యాంకు అభ్యంతరం చెప్పిందన్న ఆయన.. ఇందుకు సంబంధించి రాష్ట్రానికి లేఖ కూడా రాసిందన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులపై చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. అమరావతి అభివృద్ధికి రూ. 5వేల కోట్లు సాయమందించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
గతంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించిన సమయంలో అక్కడి రైతులు, ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారని.. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికపైనా అప్పటి ప్రభుత్వం స్పందించలేదని బుగ్గున చెప్పారు. అందుకే రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపివేశారని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకానికి కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందన్నారాయన.