సోన్ భద్ర – ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో గత బుధవారం ఓ భూవివాదం కేసులో పది మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ ఘటనను నిరసిస్తూ బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అక్కడకు వెళ్లారు. అయితే ఆమెను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. కేవలం నలుగురు వ్యక్తులతో మాత్రమే మాట్లాడుతా అని చెప్పినా.. తనను అడ్డుకుంటున్నారని ప్రియాంకా అన్నారు. తమను ఎందుకు అడ్డుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. మొదట ప్రియాంకా శాంతియుత ధర్నాకు కూర్చున్నారు. అ తర్వాత నారాయణ్పూర్ ప్రాంతంలో ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం సోన్భద్రలో 144 సెక్షన్ విధించారు.అరెస్ట్ పై ప్రియాంకా స్పందిస్తూ, తనను పోలీసులు ఎక్కడకు తీసుకువెళ్తున్నారో తనకు తెలియదని, ఎక్కడికి వెళ్లేందుకైనా తాను సిద్ధమే అని అన్నారు. ఇదే అంశంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇవాళ మాట్లాడారు. ఈ కేసుకు సంబంధం ఉన్న 29 మందిని అరెస్టు చేశామన్నారు. సింగిల్ బ్యారెల్ గన్, మూడు డబుల్ బ్యారెల్ తుపాకులు, ఓ రైఫిల్ను సీజ్ చేశామని సీఎం చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూపీ అసెంబ్లీ కూడా ఇవాళ ఇదే అంశంపై వాయిదా పడింది.