తానెప్పుడూ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతున్న ఆయన అధికారం శాశ్వతం కాదని బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. మోడీకి ప్రస్తుతం 300కు పైగా సభ్యులు ఉండి ఉండొచ్చనీ, కానీ1984 ఎన్నికలలో రాజీవ్ గాంధీకి 400కు పైగా స్థానాలతో భారీ మెజారిటీ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆ తరువాత ఏమైందో అందరికీ తెలిసిందేనని చెప్పారు. తనకుకు ముఖ్యమంత్రి పీఠం ముఖ్యం కాదన్నారు. తాను తన పదవిని కాపాడుకోవాలని భావిస్తే కాపాడుకుని ఉండేవాడినని కుమారస్వామి పేర్కొన్నారు. తానే కాదు తన కుటుంబం కూడా అధికారం కోసం ఎన్నడూ వెంపర్లాడలేదని కుమారస్వామి చెప్పారు. ప్రధాని పదవిని వదులుకుని తన తండ్రి దేవెగౌడ్ బేంగళూరుకు తిరిగి వచ్చారని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అవుతానని కలలోకూడా అనుకోలేదని కుమారస్వామి అన్నారు. ఇప్పుడు పదవి పోతుందన్న భయం అంతకంటే లేదని అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని పునరుద్ఘాటించారు. తాను కానీ తన కుటుంబం కానీ పదవుల కోసం, అధికారం కోసం వెంపర్లాడలేదని చెప్పారు.