ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారులకు తీపికబురు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతంగా నిర్ణయించిన ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు యధాతథంగా ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించిన ఈ వడ్డీ రేటును తగ్గించాలన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనను కార్మిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. దీని ద్వారా 4.6 కోట్ల మంది ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇతర పొదుపు మొత్తాలపై ఇస్తున్న వడ్డీ కంటే ఈపీఎఫ్ఓ వడ్డీ ఎక్కువగా ఉండడం పట్ల ఆర్థిక మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. మిగిలిన పొదుపు మొత్తాలకు ఇస్తున్న వడ్డీతో సమానంగా ఈపీఎఫ్ఓ వడ్డీని తగ్గించాలని కేంద్ర కార్మిక శాఖకు సూచించింది.
అయితే ఆర్థిక శాఖ సూచన పట్ల పలు కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఈ వడ్డీ రేటును తగ్గించవద్దంటూ కార్మిక శాఖను కోరాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ సూచనను తోసిపుచ్చుతూ ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును యధాతథంగా కొనసాగిస్తూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ వద్ద రూ.3,150 కోట్ల మిగులు నిధులు ఉన్నందున...వడ్డీరేటును తగ్గించాల్సిన అవసరం లేదని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.