ఈశాన్య రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తాయి. అసోంలో భారీ వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వన్యప్రాణులు సైతం అల్లాడిన పరిస్థితి. బ్రహ్మపుత్ర వంటి నదులు పొంగిపొర్లుతుండ డంతో దాదాపు 45 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 33 జిల్లాలు వరద బీభత్సంతో వణికిపోతున్నాయి. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కాజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం జలమయం అయింది. అందులోని లక్షలాది వన్యప్రాణుల పరిస్థితి ఏంటన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అసోంను చూసి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చలించిపోయారు. వెంటనే అసోంకు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అందులో కోటి రూపాయలు అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో కోటి రూపాయలు కాజిరంగ నేషనల్ పార్క్ కు విరాళంగా అందించారు. అంతేగాకుండా, తాను సాయం చేశానని, మీరు కూడా సాయం చేయండి అంటూ అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.