తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల్లో బుధవారం ఉదయం భక్తులకు దర్శనం తిరిగి ప్రారంభమైంది. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం ఆయా ఆలయాల తలుపులు మూసివేసిన విషయం విదితమే. బుధవారం ఉదయం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాల్లో ఉదయం 5.45 గంటలకు తలుపులు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం ఉదయం 6.45 గంటలకు సర్వదర్శనానికి అనుమతించారు.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాన్నిఉదయం 5 గంటలకు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం ఉదయం 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతించారు. ఈ ఆలయంలో సాయంత్రం 5.30 గంటలకు ఆణివార ఆస్థానం జరుగనుంది.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
నారాయణవనంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సత్రవాడలోని శ్రీ కరివరదరాజస్వామి ఆలయం, నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామి ఆలయాలను ఉదయం 5 గంటలకు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం తదితర సేవల అనంతరం 7 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని, చంద్రగిరి శ్రీ కోదండరామాలయాన్ని ఉదయం 6 గంటలకు తెరిచారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు.తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలను ఉదయం 6 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.