టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలనేదే వారి తల్లిదండ్రులు నిర్ణయమని ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ వెల్లడించాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్లో విజయం సాధించి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా భావించింది.అయితే, ఈ ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీస్లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్కు ధోని వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ధోని తన రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రపంచకప్ తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లనుంది. జులై మూడు నుంచి జరుగనున్న విండీస్ పర్యటనకు జట్టును ఎంపిక చేయడం కోసం శుక్రవారం టీమిండియా సెలెక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ధోని విండిస్ పర్యటనకు ఎంపికవుతాడా? లేదా అనే చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో బుధవారం స్పోర్ట్స్ తక్కు ఇచ్చిన ఇంటర్యూలో ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ మాట్లాడుతూ ధోనీ క్రికెట్కు వీడ్కోలు చెప్పాలనే అతడి తల్లిదండ్రులు సైతం కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. "గత ఆదివారం నేను ధోనీ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులతో మాట్లాడాను. ధోనీ ఇక క్రికెట్ను విడిచిపెడితే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు" అని ఆయన తెలిపాడు.ఇప్పటివరకు ధోని ఎంతో క్రికెట్ ఆడాడని, రిటైర్ అయి తమతో పాటు ఇంట్లో ఉండాలని వారు ఆశిస్తున్నట్లు కేశవ్ బెనర్జీ చెప్పుకొచ్చాడు. అయితే, ధోనీ మరో ఏడాది పాటు క్రికెట్ ఆడాలని, టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని తాను వారికి చెప్పానని అన్నాడు.
అయితే, ధోని తల్లిదండ్రులు మాత్రం ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని ఇంటి పట్టున ఉండాలని కోరుకుంటున్నారని తెలిపాడు. కాగా, ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్లో మొత్తం 8 మ్యాచ్లాడిన ధోని 273 పరుగులు చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీస్లో చేసిన 77 పరుగులే ధోని అత్యధిక స్కోరు.