కర్ణాటక రాజకీయాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే మరోవైపు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ఇవేవి పట్టనట్లుగా రిలాక్స్గా క్రికెట్ ఆడుకుంటున్నారు. అవును మీరు వింటున్నది నిజమే. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోనుండటంతో.. గురువారం సంక్షోభానికి త్వరలో తెరపడే అవకాశాలు కన్పిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టి, తదుపరి సభలోని బలా బలాలు లెక్కేసి విశ్వాస పరీక్షలో పాల్గొంటామనిప్రకటించింది. ఓవైపు సంకీర్ణ ప్రభుత్వంలోని అసమ్మతి సభ్యులను దువ్వుతున్న బిజెపి, స్వామి ప్రభుత్వం కూలిపోవటం ఖాయమన్న విశ్వాసంతో ఉంది. అందుకే నేమో బెంగళూరులోని రమాదా హోటల్ ప్రాంగణంలో యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇక్కడి మూడ్ చూసిన వారెవ్వరైనా, బిజెపి అధికారంలోకి వస్తుందన్న ధీమా యడ్యురప్ప కళ్లలో కనిపిస్తోందని చెపుతుండటం విశేషం.