దశాబ్దాల కాలంగా కాపు లకు బీసీ రిజర్వేషన్ అంశం రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. సుప్రీం ఆదేశాలున్నా ఏవో సాకులు చూపుతూ తాత్సారం జరుగుతునే ఉంది. ఏపీలో కుల సమీకరణలు గెలుపోటములు నిర్ణయించేంతగా చేరాయి.
అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ తీసుకున్న కాపులకు 5 శాతం రిజర్వేషన్ కేటాయింపులను రద్దుచేస్తున్నట్టు జగన్ చెప్పేశారు. ఇప్పుడు ఇదే ఏపీలో కీలకాంశంగా మారినట్టే కనిపిస్తోంది. ఈ విషయమై సిఎం జగన్ మాట్లాడుతూ కోటాలో ఒకే కులానికి ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇచ్చే అధికారం ఎవరికీ లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన 10 శాతం కోటాలో ఎవరికంటే వారికి ఇష్టమొచ్చినట్లు ఆరు శాతం, ఎనిమిది శాతం ఇచ్చే అధికారం లేదు. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే పది శాతం రిజర్వేషన్లు వర్తిస్తాని తేల్చిచెప్పారు. ‘ గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసిందని, చంద్రబాబు చేసిన పని వల్ల ఈ అంశం కోర్టు పరిధికి చేరటం వల్ల దీనిపై ఎవరూ ఏ నిర్ణయం చెప్పలేని పరిస్థితి అని చెప్పారు. .
అయితే 2014 చంద్రబాబు తన మేనిఫెస్టోలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తానని, కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా వెయ్యికోట్లరూపాయలు బడ్జెట్ కేటాయిస్తామం టూ చేసిన వాగ్దానం నిలబెట్టుకోనందునే కాపులను చంద్రబాబు మోసం చేశారన్న భావన నెలకొంది. దీంతో దాదాపు అంతా జగన్ వైపు తిరిగారు. జగన్ను నమ్మి గెలిపిస్తే ఇలా ప్రకటించడంపై కాపు నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విషయమై ఉలిక్కి పడిన వైసీపీలోని ఎమ్మెల్యేలు దీన్ని ఎలా బయటపడాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తమ వర్గాన్ని ఎలా నెగ్గించుకోవాలనే భయం పట్టుకుంద నిపిస్తోంది. దీన్ని ఎలాగైనా తెలివిగా దారి మళ్లించాలని వైసీపీ అనుకుంటున్న నేపథ్యంలో టీడీపీ మాత్రం దీన్ని అనుకూలంగా మార్చుకుని లాభం పొందాలని భావిస్తుంది. అయితే ఈ రెండు పార్టీల తీరును బూచిగా చూపి, ఇప్పుడిప్పుడే ఏపిలో వేళ్లూరుకుంటున్న కమలనాథులు కాపులను తమ వైపునకు మళ్లించుకోవాలనిఎత్తుగడగా తెలుస్తోంది. ఇలా ఎవరికి వారు.. కాపు రిజర్వేషన్ అంశాన్ని ఎలా ఓటుబ్యాంకుగా మలచుకోవాలనే ప్లాన్ లో ఉండటం కొసమెరుపు.
మరోవైపు కాపులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. ఈ విషయమై గతంలోనే జగన్ తన ఎన్నికల ప్రచారంలో ముందు కాదని, తదుపరి అవునని చెప్పినప్పుడే అనుమానించామని, అయితే జీల్లా నేతల భరోసాతో కాపులు జగన్కి మద్దతు ఇచ్చినా తాజా పరిస్థితులు కాపు రిజర్వేషన్లకు జగన్ సిద్దంగా ఉన్నట్టు కనిపించడం లేదని కాపు నేతలు చెపుతుండటం విశేషం.