ముంబయిలోని డోంగ్రీ ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం మంగళవారం కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కి చేరింది. ఇప్పటివరకు సహాయక సిబ్బంది 11 మందిని సురక్షితంగా కాపాడారు. ఇంకా కొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన మోడి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో భాగంగా జాగిలాలను సైతం రంగంలోకి దింపారు. విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో పాటు ఇతర యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు రాత్రంతా శ్రమించారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు.