ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(3) ప్రకారం నవ్యాంధ్రలో రాజధాని, రాజ్భవన్, సెక్రటరియేట్, అసెంబ్లీ, హైకోర్టు తదితర సదుపాయాలకు కేంద్రమే ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాల్సి ఉన్నప్పటికీ తాజాగా బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఏదో ఏపికి తప్పదని ఇచ్చాం. సర్దుకోవాలన్న తీరుగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తోంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఏ రాష్ట్రానికి నిధులు ఇవ్వదు కానీ ...అమరావతిలో సచివాలయ నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నామంటూ గతంలో చెప్పిన మాటలు గాలికొదిలేసినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతల తీరుతో వీరు ప్రభుత్వం నుంచి అందిన సమాచారంతో నే మాట్లాడుతున్నారని, రాష్ట్ర అభివృద్ధికోసమే పార్టీ మారామంటున్న నేతలు ఇప్పుడేమంటారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటికే రూ. 16 వేల కోట్ల రెవిన్యూలోటు అంటూ విభజన నాడు లెక్కలు కట్టిన కేంద్రం గతంలో ఈవిషయంపై రాష్ట్ర ం నుంచి ఎన్ని విజ్ఞప్తుల అందినా పక్కన పెట్టేసి, పైసా విదర్చని మోడి సర్కార్ రెవిన్యూలోటు కేవలం రూ. 4 వేల కోట్లేనని తేల్చేయటంతో ఇక రాజధాని నిధులపై ఆశలు వదులుకోవల్సిందేనని అనిపిస్తోంది. దీనికి తోడు రాజధాని పూర్తయితే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కేవలం 500 కోట్లే కేటాయించడంతో భవిష్యత్ తరమైనా రాజధానిని చూస్తుందా? అని అందరిలోనూ అనుమానం మొదలైంది.