అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీన పుష్పయాగ మహోత్సవం జరుగనుంది. ఇందుకోసం జూలై 17వ తేదీ బుధవారం సాయంత్రం 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు. జూలై 18వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం, సాయంత్రం 6.30 గంటలకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.
ఈ ఆలయంలో జూన్ 13 నుండి 21వ తేదీ వరకు వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్స వాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.