చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. జూలై 17వ తేది బుధవారం ఉదయాత్పూర్వం 1.31 నుండి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలను సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతిస్తారు.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాన్ని రాత్రి 7 గంటలకు మూసివేశారు. బుధవారం ఉదయం 5 గంటలకు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం ఉదయం 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆణివార ఆస్థానం నిర్వహిస్తారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను సాయంత్రం 7 గంటలకు మూసివేశారు. బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
నారాయణవనంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సత్రవాడలోని శ్రీ కరివరదరాజస్వామి ఆలయం, నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామి ఆలయాలను సాయంత్రం 6.30 గంటలకు మూశారు. బుధవారం ఉదయం 5 గంటలకు తెరుస్తారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం తదితర సేవల అనంతరం 7 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 6 గంటలకు, చంద్రగిరి శ్రీ కోదండరామాలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. బుధవారం ఉదయం 6.00 గంటలకు ఆలయాల తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలను సాయంత్రం 6 గంటలకు మూసివేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు