విమాన ప్రమాదంలో పైలెట్ అయిన భర్త మరణించడంతో ఆయన బాటలోనే నడచి భారత వాయుసేనలో సేవలందించేందుకు సిద్ధమైన భార్య ఆదర్శం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన మిరాజ్2000 ప్రమాదంలో భారత వాయుసేన పైలెట్ సమీర్ అబ్రాల్ మరణించారు. భర్త మరణం ఆయన భార్య గరీమా అబ్రాల్ ను కుంగదీసినా, మొక్కవోని విశ్వాసంతో పట్టుదలగా ప్రయత్నించి సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై భారత వాయుసేనలో చేరారు. గరీమా అబ్రాల్ దుండిగల్ లోని వైమానిక శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. మహిళల్లో స్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రాల్ భార్య గరీమా అసాధారణ మహిళ అని, ఆమె భారత వైమానిక దళం అకాడమీలో చేరడం సంతోషాన్నిచ్చిందని మాజీ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ట్వీట్ చేశారు. గరీమా భర్తతో ఉన్న ఫోటోతోపాటు ఆమె శిక్షణ పొందుతున్న ఫోటోలను అనిల్ చోప్రా ట్వీట్ కు జత చేశారు.