తిరుమల శ్రీవారి ఆలయ నిర్వహణ, భక్తుల క్రమబద్దీకరణ, అన్నప్రసాదాలు, స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై గౌ.. రాష్ట్రపతి అభినందించారని టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేకాధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్రపతి టిటిడి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను మెచ్చుకున్నారని వివరించారు. ఆలిండియా టెంపుల్ నెట్వర్కింగ్ కమిటీని టిటిడి ఏర్పాటుచేసి సలహాదారుగా ఉండాలని, శ్రీ వైష్ణోదేవి ఆలయం, శ్రీ పూరి జగన్నాథ ఆలయం తదితర పెద్ద ఆలయాలకు మార్గదర్శనం చేయాలని సూచించారని వెల్లడించారు. టిటిడి నిర్వహణపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటుచేసి ఇతర ఆలయాల నిర్వాహకులకు చూపాలన్నారు. రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. అదేవిధంగా, తిరుమలలో పెండింగ్లో ఉన్న పలు అంశాలపై సమీక్షించినట్టు తెలిపారు.