ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ' అమ్మ ఒడి ' పథకం పై నెలకొన్న గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. మంగళవారం శాసనసభలో అమ్మ ఒడి పథకానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ప్రభుత్వం 43 లక్షల మందికే ' అమ్మ ఒడి ' వర్తింపచేస్తున్నట్టు ప్రకటించిందని, రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని టిడిపి సభ్యులు ప్రశ్నించారు. అందుకు మంత్రి ఆదిమూలపు బదులిస్తూ.. పిల్లల్ని చదివిస్తున్న తల్లిని దృష్టిలో పెట్టుకునే తాము 'అమ్మ ఒడి' పథకానికి రూపకల్పన చేశామని, పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తున్నట్టు వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఎపి సర్కారు ఇదే విషయాన్ని తెలిపిందని చెప్పారు. 'అమ్మ ఒడి' పథకం అమలు కోసం బడ్జెట్ లో రూ.6,455.80 కోట్లు కేటాయించారు.