గురు పూర్ణిమ సందర్భంగా ఇవాళ(జులై-16,2019)గోవా అసెంబ్లీ లో సీఎం ప్రమోద్ సావంత్ తన రాజకీయ గురువు,మాజీ సీఎం మనోహఱ్ పారికర్ కు నివాళులర్పించారు. ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశమవగానే పారికర్ ను గుర్తుచేస్తుకున్నారు సీఎం ప్రమోద్ సావంత్. తన రాజకీయ గురువు పారికరేనని, ఆయన వల్లే తాను ఈ రోజు ఇంతస్థాయికి చేరుకున్నానని సీఎం అసెంబ్లీలో అన్నారు.
పారికర్ తో పాటుగా మరికొందరు కూడా తన జీవితంలో తనకు సహాయ సహకారాలు అందించారని,వారందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. కొన్నేళ్లుగా పాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతూ మార్చి-17,2019న పారికర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ సందర్భంగా ఇవాళ(16 జులై 2019) అన్నీ సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీతోపాటు సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఉదయం నుంచే భక్తులు సాయిబాబా ఆలయాలకు క్యూ కట్టారు. సాయిబాబా ఆలయాలకు భారీ సంఖ్యల్లో భక్తులు తరలిరాగా సాయినాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. షిర్డీలో గురుపౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సాయినామ స్మరణతో తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయిబాబా భక్తులు సందడి చేస్తున్నారు.
ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు. వ్యాసముహాముని జన్మతిథి కావడంతో 'గురుపౌర్ణమి'ని మహాపర్వదినం భావిస్తున్నారు భక్తులు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. 'గురుర్బహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర: గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :' అంటూ గురువును పూజించటం ఈరోజుకు ఉన్న ఆనవాయితీ.