ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రయాన్-2 మరింత ఆలస్యం

national |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2019, 12:14 PM

యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్‌-2’ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉపగ్రహాన్ని మోసుకెళ్లే వాహకనౌక జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగానికి 56 నిమిషాల ముందు కౌంట్‌డౌన్ నిలిపేశారు. ఇస్రో కీర్తి పతాక గగనతలంపై మరోసారి ఎగురుతుందని భావించినా ప్రయోగం నిలిచిపోవడంతో నిరాస తప్పలేదు. చంద్రయాన్‌-2 ద్వారా చంద్రుడు-సౌర కుటుంబం పుట్టుక రహస్యాలతోపాటు చంద్రుడిపై నీరు, ఖనిజాల విస్తృతిని శోధించేందుకు ఉద్దేశించిన ప్రయోగం.


ప్రయోగ సమయానికి గంట ముందు వాహకనౌక జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ముందుజాగ్రత్త చర్యగా ప్రయోగాన్ని నిలిపివేస్తున్నామని ఇస్రో అధికారులు తెలిపారు. తదుపరి ప్రయోగ సమయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు. చంద్రయాన్‌-2లో సమస్యను ప్రయోగానికి ముందే గుర్తించడంతో పెద్ద ఇబ్బంది తప్పింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చుచేయగా, ఏళ్ల తరబడి శాస్త్రవేత్తల శ్రమిస్తున్నారు. చరిత్రాత్మకమైన ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి ఇబ్బందికి ఆస్కారం ఉండకూడదన్న ఉద్దేశంతో ఇస్రో అనేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రయోగానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ నిశితంగా గమనించి, పరిస్థితిని పర్యవేక్షించింది. 


జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3లో తలెత్తిన సాంకేతిక లోపంపై ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ కోణాల్లో పరిశీలన జరుపుతున్నారు. క్రయోజెనిక్‌ దశలో లోపం తలెత్తినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. క్రయోజనిక్ ఇంజిన్‌లో హీలియం బాటిల్‌లో లీక్ ఏర్పడినట్టు గుర్తించారు. ‘ఈ ఇంజిన్‌లోని ఒక సర్క్యూట్‌లో ఇంధనంగా ద్రవ ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియం నింపి ఉంచినప్పుడు బాటిల్‌లో పీడనం 50 నుంచి 350 ఉంటుంది.. హీలియం నింపిన తర్వాత దాని పీడనం తగ్గిపోవడం గుర్తించామని, ఇది లీక్ అవుతుందనడానికి సూచన అంటూ ఓ సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు. గ్యాస్ కంటెయినర్‌లో లీక్ ఎక్కడయిందనే అంశాన్ని తెలుసుకోడానికి శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించగా పలు చోట్ల లీక్‌లు ఉన్నట్టు గుర్తించారన్నారు. 


సన్నాహక పరీక్షల సమయంలో క్రయోజనిక్ ఇంజిన్‌లోని ఆక్సిజన్ ట్యాంక్‌లో లీక్ ఏర్పడిన విషయం జూన్ 22న గుర్తించినా, ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో నిర్ణయించిందని అన్నారు. మరో సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ... త్వరలోనే ప్రయోగం నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుత లాంచింగ్ విండో జులై 31తో ముగియనుందని, తర్వాత విండో సెప్టెంబరులో వస్తుందని అన్నారు. 


వాహకనౌకలో ఏర్పడిన లోపాలను గుర్తించేందుకు కమిటీలను నియమించారు. కమిటీల్లో రిటైర్డ్ డైరక్టర్లు, సీనియర్‌ శాస్త్రవేత్తలు ఉంటారు. లోపాలను గుర్తించి ఇస్రో ఛైర్మన్‌కు నివేదిక సమర్పిస్తారు. ఇస్రో వద్ద ఉన్న వాహకనౌకలన్నింటిలోకి అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రాకెట్‌ను ‘నాటీ బాయ్‌’గా, ‘ప్యాటీ బాయ్‌’గా పిలుస్తారు. నాలుగు టన్నుల బరువును భూ కక్ష్యలోకి ఇది మోసుకెళ్లగలదు. ఇది మూడు అంచెల రాకెట్‌. మొదటి దశలో ఉండే రెండు స్ట్రాపాన్‌ మోటార్లు ఘన ఇంధనంతో పనిచేస్తాయి. 


రెండో దశలో కోర్‌ బూస్టర్‌‌లో ద్రవ ఇంధనం ఉంటుంది. మూడోది క్రయోజెనిక్‌ ఇంజిన్‌ దశ. ఇందులో ఇంధనంగా ద్రవ హైడ్రోజన్‌, దాన్ని మండించే ఆక్సిడైజర్‌గా ద్రవ ఆక్సిజన్‌ ఉంటాయి. చంద్రయాన్‌-2 ప్రయోగం సాఫీగా సాగి ఉంటే అది.. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3కి నాలుగో యాత్ర అయ్యిండేది. 2022లో ప్రయోగించాల్సిన భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్రకు కూడా ఈ వాహకనౌకనే ఉపయోగించాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com